




Best Web Hosting Provider In India 2024

సరైన ఆహారం తింటే సరిపోదు, ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తినడానికి సద్గురు చెప్పిన సరైన విధానం ఇదే!
సరైన ఆహారం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా తినడం కూడా అంతే ముఖ్యం. ఆహారం సరైన విధానంలో తీసుకుంటేనే అది మన శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. సద్గురు చెప్పిన ఆ ఆహార విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. అది శరీరానికి పోషకాహారాన్ని, శక్తిని అందించేదిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం వల్ల శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుంది. కానీ, ఇదంతా సాధ్యం కావాలంటే, ఆహారాన్ని సరైన విధానంలో తీసుకుంటేనే జరుగుతుంది. ఆహార విధానం సరిగా లేకపోతే, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా శరీరానికి పూర్తి ప్రయోజనం దక్కదు. ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆహారం తీసుకునే సరైన విధానం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ విధానాలను పాటించడం వల్ల శరీరం, మనసు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే,
నేలమీద కూర్చుని భోజనం చేయండి
సద్గురు చెప్పిన దాని ప్రకారం, నేలమీద కూర్చుని భోజనం చేయాలి. రెండు కాళ్ళు మడతపెట్టుకొని కూర్చుని తినాలి. సద్గురు ప్రకారం, కాళ్ళు చాచి కూర్చుని తినకూడదు. అలా చేస్తే ఆహారంలోని ప్రతికూల శక్తి మనకు చేరుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
చేతులతో ఆహారం తినండి
చాలామంది ప్రస్తుతం పాటిస్తున్న అలవాటు స్పూన్తో భోజనాన్ని తినడం. గతంలో అందరూ చేతులతోనే ఆహారం తినేవారు. అదే పద్ధతిని అవలంభించమని, సద్గురు కూడా చేతులతోనే ఆహారం తినమని చెబుతున్నారు. చేతులతో ఆహారాన్ని తాకినప్పుడు, ఆ ఆహారం మన శరీరానికి సరిపోతుందో లేదో తెలుస్తుంది. చెంచాతో తింటే ఆ ఆహారం ఎలా ఉందో కూడా తెలియదు.
24 సార్లు నమలండి
సద్గురు ప్రకారం, ఆహారాన్ని 24 సార్లు నమలాలి. ఆధునిక శాస్త్రంలో కూడా ఆహారాన్ని బాగా నమలాలని చెప్పారు. ఎందుకంటే, ఆహారాన్ని బాగా నమలితేనే అది సులభంగా జీర్ణమవుతుంది.
తినే సమయంలో మాట్లాడకండి
సద్గురు ప్రకారం, తినేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి తినే ఆహారం బయటపడుతుంది. తినేటప్పుడు ఆహారం మాత్రమే లోపలికి వెళ్లాలి. ఈ రెండు పనులు ఒకేసారి చేయడం సాధ్యం కాదు. శాస్త్రం ప్రకారం కూడా తినేటప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆహారం, శ్వాసనాళం కలిసి ఉంటాయి. తినేటప్పుడు మాట్లాడితే ఆహార కణాలు శ్వాసనాళంలోకి వెళ్ళి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
ఆకలి వేసినప్పుడు రెండు నిమిషాలు వేచి ఉండండి
సద్గురు ఎల్లప్పుడూ సాధనపై దృష్టి పెట్టాలని చెబుతారు. ఆకలి వేసిన వెంటనే తినకుండా రెండు నిమిషాలు వేచి ఉంటే మానసికంగా బలపడతారు. ఆ తర్వాత భోజనం చేయొచ్చు.
వయసుకు తగినట్లుగా ఆహారం తీసుకోండి
ప్రతి వయసులోనూ శరీరానికి కొంత మోతాదులో ఆహారం అవసరం. సద్గురు ప్రకారం, వయసును దృష్టిలో ఉంచుకొని, శరీరానికి అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలట. ఆహారం తీసుకునేటప్పుడు మీ వైద్య పరిస్థితిని కూడా గుర్తుంచుకోవాలి.
సమయానికి భోజనం చేయడం మంచిది
సద్గురు ప్రకారం, ప్రతిరోజూ నిర్ణీత సమయంలో భోజనం చేయడం శరీరానికి మంచిది. రోజంతా ఏదో ఒకటి తింటుంటే శరీర కణాలలో చాలాకాలం వరకు అశుద్ధ పదార్థాలు పెరిగిపోతాయి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
శరీరానికి తేలికైన ఆహారం మంచిది
సద్గురు ప్రకారం, ప్రతి ఒక్కరూ 1.5 నుండి 2.5 గంటల్లో జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాన్ని తినకూడదు. తేలికైన ఆహారం తింటే శరీరం చురుకుగా ఉంటుంది.
రాత్రి భోజన సమయం సరిగ్గా ఉండాలి
సద్గురు సలహా ఏమిటంటే, రాత్రి భోజనం నిద్రించడానికి 3 గంటల ముందు తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాలు శారీరక కార్యకలాపాలు చేసిన తర్వాతే నిద్రించడానికి వెళ్ళాలి. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సంబంధిత కథనం