Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కె సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. విద్యుత్ బకాయిల చెల్లింపు పై తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టులో అనుకూలంగా వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ జెన్కో ద్వారా తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసింది. ఈ మేరకు తెలంగాణ చెల్లించాల్సిన 6756.92 కోట్ల రూపాయల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన 3441.78 కోట్ల రూపాయల అసలుతోపాటు 3315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్ చార్జీలు రూపంలో చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు వివరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై జారీ చేసిన ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు 2023 అక్టోబర్ 19న తీర్పు వెలువరించిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థులకు కొత్త పాఠ్య ప్రణాళిక
ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. కొత్త బోధన ప్రణాళిక కింద వృత్తిపరంగా మొదటి సంవత్సరంలో “కుటుంబ దత్తత కార్యక్రమం-లక్ష్యాలు అందుకోవడం” అనే పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ స్థితిగతులను అర్థం చేసుకోవలసి ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ పేరిట రూపొందించిన ఈ కొత్త బోధనా ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలు జాతీయ మెడికల్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.