
Best Web Hosting Provider In India 2024

Prakasam Crime : ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన సొంత కన్న కొడుకునే తుపాకీతో కాల్చి హతమార్చారు. జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తండ్రి కాల్చి చంపాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లోని ఈవీఎం గోదాములో ఈ ఘటన జరిగింది. త్రిపురాంతకం గ్రామానికి చెందిన కొదుముల ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే గోదాము (స్ట్రాంగ్ రూం) వద్ద పహారా విధులను నిర్వహించాలని ఉన్నతాధికారులు కేటాయించారు. అందులో భాగంగా విధులు నిర్వహించడానికి రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శశికుమార్ (22)తో కలిసి బైక్ పై స్ట్రాంగ్ రూం వద్దకు వచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గోదాముల్లోకి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తప్ప ఇతరులెవ్వరూ ప్రవేశించకూడదు. అయినప్పటికీ కుమారుడు శశికుమార్ ను తన వెంట తీసుకొని గోదాములోకి వెళ్లాడు ప్రసాద్.
జీతం డబ్బులు అడిగాడని
అక్కడ తనకు జీతం డబ్బులు ఇవ్వాలని తండ్రి ప్రసాద్ ను శశికుమార్ అడిగాడు. డబ్బులిచ్చేందుకు ప్రసాద్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడై ప్రసాద్ ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో కుమారుడిని కాల్చాడు. కుమారుడి ఛాతీపై ఒక రౌండ్ కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రసాద్ ను నియంత్రించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే శశి కుమార్ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శశికుమార్ మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ను పోలీసులు అదుపు తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ కొద్ది నెలలుగా మద్యానికి బానిస అయ్యాడు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో వి గ్రాండ్ ఎదురుగా కానిస్టేబుల్ కె. ప్రసాద్ కుటుంబం జీవనం సాగిస్తుంది. ప్రసాద్ 1998 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్. ప్రసాద్ కు ముగ్గురు సంతానం కాగా, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే అమ్మాయిలిద్దరికీ వివాహం అయింది. మృతుడు శశికుమార్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కేంద్రంలో ఇంద్రానగర్ లో నివాసముంటున్న రఫిక్ (43) అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రఫిక్ దాదాపు 20 ఏళ్లుగా చేనేత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చేనేత పరిశ్రమ పూర్తిగా కుంటపడడంతో తనకున్న నాలుగు మగ్గాలను ఆపేశారు. మగ్గాల నిర్వహణ, కుటుంబ పోషణ నిమిత్తం రఫిక్ సుమారు రూ.20 లక్షల అప్పు చేశాడు. వీటిని తీర్చలేక, మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో మగ్గం గుంతకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య యాస్మిన్, కుమార్తె షాహీన, కుమారుడు షేక్షావలి ఉన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్