Best Web Hosting Provider In India 2024
Amaravati Capital : అమరావతి రాజధానిలో నిలిచిపోయిన పనులపై రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీ రాజధానిలో ఉన్న సమస్యలను గుర్తించి సూచనలు చేయనుంది. ఛైర్మన్ తో సహా మొత్తం ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఆర్ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధి… సభ్యులుగా ఉన్నారు. ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈ వ్యవహరించనున్నారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని నిర్మాణంలో పనులు ప్రస్తుత పరిస్థితిని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
భవనాల పటిష్టతపై అంచనాలు
మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను టెక్నికల్ కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం పలువురి సలహాలు తీసుకోనుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టం అంచనా వేయనుంది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలించనుంది. పైప్ లు, ఇనుము, ఇతర మెటీరియల్ సామర్థ్యం అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడం, నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ధిష్టమైన సూచనలు చేయనుంది కమిటీ. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్ లను అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్