YS Jagan On CM CBN : ‘చంద్రబాబు గారు.. నిజాలివే, జాగ్రత్తగా చదువుకోండి’ – వైఎస్ జగన్ ప్రశ్నస్త్రాలు

Best Web Hosting Provider In India 2024


ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు.ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని… ఇది పచ్చిమోసం కాదా? అని ప్రశ్నించారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే ప్లేటు ఫిరాయించారన్నారు. అబద్దపు లెక్కలతో ప్రజలను మోసంచేయడం మానుకోవాలని హితవు పలికారు. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టాలన్నారు.

 

ఇది మోసం కాదా…?

“చంద్రబాబు ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని.. అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

 

ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని జగన్ దుయ్యబట్టారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీచేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. “అప్పులకు వడ్డీలుకట్టాలి, అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శనాస్త్రాలను సంధించారు.

 

“తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇవ్వలేదు, రైతు భరోసాకింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20వేలు రాలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద రెండు త్రైమాసికాల డబ్బులు పెండింగ్‌, వసతి దీవెనా లేదు. సున్నావడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకూడా నెల రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు జాడే లేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ. 3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. చివరకు రూ.20వేలు ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదు. పేదలకు అత్యవసరమైన ఆరోగ్యశ్రీ చెల్లింపులు రూ.1600 కోట్లు పెండింగ్‌. ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం ఆగిపోయింది” అంటూ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు.

 

రాష్ట్రంలో ఇంగ్లీషుమీడియం గాడితప్పిందన్నారు జగన్. బడుల్లో, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసిందని దుయ్యబట్టారు. లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పిందన్నారు. “రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశయాప్‌ అటకెక్కింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ?” అని జగన్ నిలదీశారు.

 

“ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లమేర రాష్ట్రం అప్పులపాలైందని, శ్రీలంక అయిపోయిందని, ఆర్ధిక విధ్వంసం జరిగిందని మీరు ఊరూరా విష ప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది, నన్ను మించినవారు లేరు.. అమలు చేసే బాధ్యత నాదీ అని, సూపర్‌ సిక్స్‌ అంటూ సూపర్‌ టెన్‌ అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారు. అది కూడా అసత్యమే అయినా సాక్షాత్తూ గవర్నర్‌గారితో అసెంబ్లీలో ఇలాంటి అనేక అవాస్తవాలను చెప్పించారు” అని జగన్ గుర్తు చేశారు.

 

జాగ్రత్తగా చదువుకోండి – వైఎస్ జగన్

“నిజాలు ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, విద్యుత్‌ కంపెనీల రుణాలతో కలిపి, గ్యారంటీ రుణాలు, నాన్‌ గ్యారంటీ రుణాలు ఇవన్నీ జూన్‌ 2024నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల రూ.7,48,612కోట్లు. ఇందులో 2019లో మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు. దీనికిపైన ఉన్నవి మాత్రమే మా హయంలో చేసిన అప్పులు. మీ హయాంలో అప్పుల వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 21.63శాతం అయితే, కోవిడ్‌ కారణంగా ఆర్థికవ్యవస్థలో మహా సంక్షోభం వచ్చినా, మా హయాంలో అది కేవలం 12.9 శాతమే. ఈ వాస్తవాలన్నింటినీకూడా గవర్నర్‌గారికి లేఖ రూపంలో తెలియజేశాం. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్‌ https://bit.ly/4dkOKru లో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు” అంటూ తన ప్రకటనలో జగన్ పేర్కొన్నారు.

 

ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేయాలని జగన్ హితవు పలికారు. అబద్దపు లెక్కలతో ప్రజలను మోసంచేయడం మానుకోవాలని… సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టాలన్నారు.

 

టాపిక్

Andhra Pradesh NewsYs JaganChandrababu NaiduYsrcp Vs Tdp

Source / Credits

Best Web Hosting Provider In India 2024