Bandi Sanjay : ఆర్మీ జవాన్లే దేశానికి రియల్ హీరోస్, అగ్ని పథ్ స్కీంపై అపోహలు నమ్మొద్దు – బండి సంజయ్

Best Web Hosting Provider In India 2024


Bandi Sanjay : సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశభక్తి విషయంలో రాజీలేని ధీరత్వం మోదీ సొంతమన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్ము కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని చాటి చెప్పడమే కాకుండా ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని నిరూపించిన ధీరోధాత్తుడు నరేంద్రమోదీ అని కొనియాడారు. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్ని పథ్’ స్కీం ఎంతో మంచిదని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూశాయన్నారు. ఈ స్కీంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్దంగా ఉందే తప్ప విపక్షాల వలలో పడి విద్యార్థులు మోసపోవద్దని కోరారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, మానకొండూరు మండలం అన్నారంలో రైతు ప్రగతి ఆద్వర్యంలో ఈడీబుల్ కప్స్ ఇండస్ట్రీని ప్రారంభించారు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఇంటర్ విద్యతో ఇంజినీరింగ్ డాక్టర్లను తయారు చేయడమే కాకుండా డిఫెన్స్ కళాశాల నిర్వహిస్తూ సైన్యంలో చేరే దేశభక్తులను తయారు చేయడం అభినందనీయమన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం నిజంగా చాలా గ్రేట్… ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడమంటే దేశానికి సేవ చేయడమే…అంత గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీరంతా నిజమైన దేశభక్తులని విద్యార్థులకు సూచించారు. దేశభక్తి, నైతిక విలువలు పెంచుతూ క్రమశిక్షణను అలవర్చుతూ అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని తెలిపారు. గత ఏడేళ్లలో ఈ అకాడమీ 2 వేల మంది విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు.

అగ్నిపథ్ స్కీమ్ ను పది పాస్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అగ్నిపథ్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారని బండి సంజయ్ తెలిపారు. అగ్నిపథ్ స్కీం రావడంతో పెద్ద ఎత్తున అగ్నివీరులుగా గుర్తించి నాలుగేళ్లపాటు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల తరువాత వంద మందిలో 25 శాతం మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకుంటున్నామని, మిగిలిన వాళ్లకు కార్పస్ ఫండ్ పేరిట 5 లక్షలతోపాటు కేంద్రం మరో 5 లక్షలు, మరో లక్ష వడ్డీ కలిపి మొత్తం 11 లక్షల రూపాయలకు నగదును కేంద్రం అందజేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కోటాను ప్రకటించిందన్నారు. 4 ఏళ్లపాటు ఉద్యోగం చేసే సమయంలో ఏదైనా జరిగితే 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా (నష్ట పరిహారాన్ని) కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. సర్వీసులో అంగవైకల్యం కలిగితే సైతం పరిహారం అందజేయడం జరుగుతుందని, ఎంతో దూరదృష్టితో మోదీ అగ్నిపథ్ స్కీంను ప్రవేశపెడితే ప్రతిపక్షాలు, కొందరు గిట్టని వారు కలిసి ఎంత రాద్దాంతం చేశారో మీ అందరికీ తెలుసన్నారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ నేతలైతే మోదీ ప్రభుత్వంపై విషం చిమ్మారని, మోదీ ప్రభుత్వం అసలు ఉద్యోగాలే భర్తీ చేయలేదని, ఉపాధి కల్పించలేదని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టి ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. రెచ్చగొట్టే వారిని నమ్మకుండా అగ్ని పథ్ స్కీమ్ లో ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం సావధానంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.‌ యూపీఏ 10 ఏళ్ల పాలనలో ఏడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మోదీ ప్రభుత్వం ప్రతినెలా 70 నుంచి 90 వేల ఉద్యోగాల చొప్పున ఒక్క ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. 2014 నుంచి 2023 వరకు 8 లక్షల ఉద్యోగాలకుపైగా భర్తీ చేసిందని తెలిపారు.

యూపీఏ హయాంలో వందల్లోనే స్టార్టప్ లు ఉంటే… మోదీ పాలనలో 1 లక్షా 40 వేల స్టార్టప్స్ ప్రారంభమై యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలను కల్పించే స్థాయికి వచ్చారని బండి సంజయ్ తెలిపారు. అంతేగాకుండా 8 కోట్ల మందికిపైగా ప్రజలకు ముద్ర రుణాలందించి వ్యాపారాలను ప్రారంభించేలా చేశారని, గత 10 ఏళ్లలో దేశ బడ్జెట్ 3 రెట్లు పెరిగి 48 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారంటే మోదీ పాలన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. దురదృష్టం ఏమిటంటే ఈ విషయాలపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.

370 ఆర్టికల్ రద్దు సాహసోపేతమైన నిర్ణయం

పంద్రాగస్టు నాడు దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేసి సంబురాలు జరుపుకుంటే.. కాశ్మీర్ లో బాంబు పేలుళ్లు జరిగేవి. కాశ్మీర్ లో ఈ దేశ పతాకాన్ని ఎగరేయరు. ఈ దేశ పౌరులు కాశ్మీర్ లో గజం జాగా కూడా కొనే అవకాశం లేదు. అక్కడి వాళ్లను పెళ్లిళ్లు చేసుకునే అవకాశం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ పాలకులు 370 ఆర్టికల్ ను తీసుకొస్తే ఏక్ దేశ్ మే దో విధాన్… దో ప్రధాన్.. దో నిషాన్ నహీ నహీ చలేగా అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీసహా ఎంతో మంది కార్యకర్తలు, సైనికులు పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఈ విషయాన్ని గమనించిన మోదీ 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ దేశాభివృద్ది కోసం మోదీ చేస్తున్న కృషిలో మీరంతా భాగస్వాములు కావాలని బండి సంజయ్ కోరారు.

ఆర్మీ జవాన్లే దేశానికి రియల్ హీరోస్

దేశానికి రియల్ హీరోలు జవాన్లేనని స్పష్టం చేశారు బండి సంజయ్. మోదీ దీపావళి పండుగ సంబురాలు సరిహద్దులకు వెళ్లి జవాన్ల మధ్యే జరుపుకుంటారు… ఎందుకో తెలుసా? మీకు పరమ వీర చక్ర విక్రమ్ బాత్రా గుర్తున్నాడా? ఆర్మీలో ఆయన పేరు తెలియని వాళ్లే ఉండరు…అంటూ కార్గిల్ యుద్ధం గురించి విద్యార్థులకు బండి సంజయ్ వివరించారు.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం

టాపిక్

KarimnagarIndian ArmyTelangana NewsTrending TelanganaBandi Sanjay

Source / Credits

Best Web Hosting Provider In India 2024