Best Web Hosting Provider In India 2024
రాష్ట్రంలో మెగా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ అని ఖారారు చేసింది. అర్హులైన, ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్లో దరఖాస్తును చేసుకోవాలని.. సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నారు. మూడు నెలల పాటు శిక్షణ పొందనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వనున్నారు.
షెడ్యూల్ ఇదే..
దరఖాస్తు దాఖలకు గడువు అక్టోబర్ 21తో ముగుస్తుంది. అదే రోజే ఆరు దశల వెరిఫికేషన్కు ఆఖరు తేదీ. అక్టోబర్ 22 నుంచి 25 వరకు స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను కూడా అధికారిక వెబ్సైట్ జ్ఞానభూమి వెబ్ పోర్టల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. అక్టోబర్ 27న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అక్టోబర్ 28న జిల్లాల వారీగా మెరిట్ లిస్టులను విడుదల చేస్తారు. అక్టోబర్ 30 జిల్లాల వారీగా ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తారు. నవంబర్ 3న శిక్షణ కేంద్రాల వారీగా అభ్యర్థుల కేటాయింపు ఉంటుంది. నవంబర్ 11 నుండి ఉచిత కోచింగ్ క్లాస్లు ప్రారంభం అవుతాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్ పోర్టల్ డైరెక్ట్ లింక్ https://mdfc.apcfss.in/ పై క్లిక్ చేస్తే.. రిజిస్ట్రేషన్ అడుగుతోంది. పేరు, పాస్వర్డ్, క్యాప్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత అప్లికేషన్లో అడిగిన వాటిని పూర్తి చేయాలి. అభ్యర్ధుల వార్షిక ఆదాయం రూ.2,50,000 లోపు ఉండాలి. నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకునేవారినే అనుమతి ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తగిన సమయంలోనే దరఖాస్తు దాఖలు చేసుకోవాలి.
ఎంతమందిని ఎంపిక చేస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీ అభ్యర్థులు 3,050, ఎస్టీ అభ్యర్థులు 2,000 మంది ఉంటారు. ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ వెయిటేజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్కు 85 శాతం, టెట్ స్కోర్కు 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని.. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.
ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో నవంబర్ 3న మెగా డీఎస్సీకి నోటీఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఇటీవలి జరిగిన టెట్ పరీక్షల ఫలితాలు నవవంబర్ 2న ప్రకటిస్తారు. టెట్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మెగా డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయాలని భావించినప్పటికీ.. వీలు కాలేదు. కేవలం మెగా డీఎస్సీపైన సంతకం మాత్రమే పెట్టారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్