Best Web Hosting Provider In India 2024
హైదరాబాద్ నగరం, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి.. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తాజాగా తెలంగాణ సచివాలయంలో మూసీ సుందరీకరణ, అభివృద్ధి గురించి అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసింది. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించాం. ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైంది. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణం. కంప్యూటర్తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ విజన్తోనే దేశం ముందడుగు వేసింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచింది. అభివృద్ధిని ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూనే ఉంటారు.. అధికారం కోల్పోయిన వాళ్లు ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారు’ రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లు.. అలాంటి వాళ్లు మూసీని అడ్డుకుంటున్నారు. యూట్యూబ్లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు. కేసీఆర్, మీ నియోజకవర్గానికే వస్తా.. రచ్చబండ నిర్వహిద్దాం. కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వస్తా. ఇది మూసీ సుందరీకరణ కాదు, ప్రక్షాళన’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారింది. మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నాం. నదీగర్భంలో నివసిస్తున్న వారిపై ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేశారు. 1600 ఇళ్లు నదీగర్భంలో ఉన్నాయి’ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
టాపిక్