Best Web Hosting Provider In India 2024
తెలంగాణలో డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటి కోసం ఉద్యోగులు నెలల తరబడి వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం కరవు భత్యం ప్రకటించారు. దీంతో తెలంగాణలోనూ డీఏలు ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఇదే అంశంపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డికి 9 అంశాలను గుర్తు చేశారు.
1.కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి హామీ ఇచ్చారు. ఆనాటికి పెండింగ్లో ఉన్న3 డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి.. బకాయిలను నేరుగా ఉద్యోగస్థులకు నేరుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
2.పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంసీహెచ్ఆర్డీలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే కేబినెట్లో చర్చించి డీఏలు వెనువెంటనే విడుదల చేస్తామని మరోసారి హామి ఇచ్చి మాట తప్పారు.
3.మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఈ నాటికి 5 డీఏలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ప్రభుత్వం బకాయి పడింది. డీఏలు విడుదల చేయకపోవడం వల్ల ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.5000 నుంచి రూ.20,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది.
4.బకాయి పడ్డ 5 డీఏల మొత్తం 17.29 శాతం గురించి ఈనెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాలి. దీపావళి కానుకగా బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
5.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి.. 6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
6.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా.. సప్లిమెంటరీ బిల్లులను 15 పనిదినాల్లో చెల్లిస్తామని చెప్పిన మీరు.. ఇప్పటికీ జీపీఎఫ్, సరెండర్ లీవ్ తదితర సప్లిమెంటరీ బిల్స్ నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం.. వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
7.ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీనిపై కూడా ఈనెల 23న నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.
8.ఈ ఏడాది మార్చి 31 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్ మెంట్ బెన్ఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వారికి రావాల్సిన జీపీఎఫ్, ఇల్ ఎన్ క్యాష్మెంట్, గ్రాట్యుయిటీ, ఇన్సూరెన్స్, కమ్యూటెడ్ బకాయిల కోసం సచివాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరగలేకపోతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
9.ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. అని మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.
టాపిక్