Best Web Hosting Provider In India 2024
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాక్ ఇచ్చింది. రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్ల వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన అడ్వాన్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్పీ) నిబంధన వచ్చే నెల (నవంబర్) ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.
అయితే.. పగటి పూట నడిచే తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్, విదేశీయులకు 365 రోజుల ఏఆర్పీ పరిమితిలో మార్పు ఉండదని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 61 నుంచి 120 రోజుల వ్యవధిలో చేసిన రిజర్వేషన్లలో దాదాపు 21 శాతం రద్దు చేయాల్సి వస్తోందని వివరించింది.
మరో 5 శాతం మంది ప్రయాణం చేయలేకపోయినా.. తమ టికెట్లను రద్దు చేసుకోవడం లేదని రైల్వే శాఖ తెలిపింది. ప్రధానంగా ముందస్తు రిజర్వేషన్ల కారణంగా.. నో షో ట్రెండ్ కొనసాగుతోందని, దీన్ని తగ్గించడం కోసం ఈ కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. అవసరమైన ప్రయాణీకులకు టిక్కెట్ల లభ్యతను మెరుగుపరచడం, రిజర్వ్డ్ బెర్త్ల ఖాళీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ వివరించింది.
ఈ తాజా నిర్ణయంతో పండుగలు, పీక్ సీజన్లలో ప్రత్యేక రైళ్లు వేసేందుకు దోహదపడుతుందని వివరించింది. కాగా.. 2015 జనవరి 1న 60 రోజులుగా ఉన్న ఏఆర్పీని 120 రోజులకు రైల్వే శాఖ పెంచింది.
ఎప్పుడెప్పుడు ఎంత ఏఆర్పీ..
1981 ఏప్రిల్ నుంచి 1985 జనవరి వరకు 120 రోజులు
1985 ఫిబ్రవరి 1 నుంచి 1988 ఆగస్టు 31 వరకు 90 రోజులు
1988 సెప్టెంబర్ 1 నుంచి 1993 సెప్టెంబర్ 30 వరకు 60 రోజులు
1993 అక్టోబర్ 1 నుంచి 1995 జూన్ 30 వరకు 45 రోజులు
1995 జూలై 1 నుంచి 1998 జనవరి 1 వరకు 30 రోజులు
1998 ఫిబ్రవరి 1 నుంచి 2007 ఫిబ్రవరి 28 వరకు 60 రోజులు
2007 మార్చి 1 నుంచి 2007 జూలై 14 వరకు 90 రోజులు
2007 జూలై 15 నుంచి 2008 జనవరి 31 వరకు 60 రోజులు
2008 ఫిబ్రవరి 1 నుంచి 2012 మార్చి 9 వరకు 90 రోజులు
2012 మార్చి 10 నుంచి 2013 ఏప్రిల్ 30 వరకు 120 రోజులు
2013 మే 1 నుంచి 2015 మార్చి 31 వరకు 60 రోజులు
2015 ఏప్రిల్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు 120 రోజులు
2024 నవంబర్ 1 నుంచి 60 రోజులు
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్