KTR With Students : విద్యార్థుల త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ.. రేపటి భవిష్యత్తు మీదే : కేటీఆర్

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించిందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినమన్న కేటీఆర్.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని వ్యాఖ్యానించారు. అంతటి ఉద్ధండుల ముందు ఈ రేవంత్ రెడ్డి ఎంత? అని ప్రశ్నించారు. ఈ సీఎంను తిట్టాలన్న, ఏదైనా చెప్పాలన్న మనసు రావటం లేదని ఎద్దేవా చేశారు.

‘ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెల్వదు. ఏమీ తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టు మూడు దిక్కులు సముద్రం ఉందంటాడు. ఆగస్ట్ 15 రోజు స్పీచ్‌లో భాక్రానంగల్ తెలంగాణలో ఉందంటాడు. రాసిచ్చినది కూడా చూసుకోకుండా చదువుతాడు. విప్రో సీఈవో సత్య నాదెళ్ల అంటాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

‘పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి బాధ పెట్టినా సరే ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావాలని.. 95 శాతం కొలువులు మన బిడ్డలకే దక్కేట్టు పోరాటం చేసి.. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది కేసీఆర్. జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాల, గురుకులాలు.. ఇవన్నీ మనం సాధించిన విజయాలు. కేసీఆర్‌కు తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘తెలంగాణకు ఓ పెట్టుబడి, ఓ అవార్డు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడే వాళ్లం. మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అంటూ కొంత మంది అడిగేవాళ్లు. తెలంగాణకు మంచి జరిగితే మాకు మంచి జరిగినట్టే భావిస్తామని సంతోషంతో రొమ్ము విరుచుకొని చెప్పే వాళ్లం. శ్రీకాంతా చారి, యాదిరెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి వందల మంది విద్యార్థుల త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ. నీళ్లు, నియామాకాలు, నిధులు అనే నినాదాన్ని ప్రామాణికంగా పని చేశాం’ అని కేటీఆర్ వివరించారు.

‘నీళ్ల రంగంలో సంపూర్ణ విజయం సాధించాం. కాళేశ్వరం పూర్తి చేశాం. పాలమూరు-రంగారెడ్డి పనులు 90 శాతం పూర్తి చేశాం. నల్గొండలో ఫ్లోరోసిస్‌ను పూర్తిగా తుడిచి వేసిన ఘనత కేసీఆర్‌ది. తలసరి ఆదాయంలో రాష్ట్రం ఏర్పడే నాటికి మనది 14వ స్థానం. కేసీఆర్ దిగిపోయే నాటికి నంబర్ వన్‌గా నిలిచి కాలర్ ఎగరేసుకొనే పరిస్థితి వచ్చింది. నీళ్లు, రైతుబంధు సహా భూముల విలువ పెంచిన కేసీఆర్.. రైతుల్లో ధీమా నింపారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చిన సరే ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. ఆశ ఆడబిడ్డలు వచ్చి కేసీఆర్ మేము అడగకుండానే రూ. 9,900 ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మాకు 18 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబితే మోసం పోయామని చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రిని కదిలించాలంటే మీరు వేలాదిగా తరలి రావాల్సిన అవసరముందని వారికి చెప్పాను’ అని కేటీఆర్ వివరించారు.

‘గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ రీ-షెడ్యూల్ చేయాలని అశోక్ నగర్‌లో పోరాటం చేసిన విద్యార్థులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా.. రిజర్వేషన్లలో మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలతో గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ రద్దయ్యే పరిస్థితి ఉంది. అశోక్ నగర్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికి అక్కడ పోలీసులను పెట్టటంతో విద్యార్థులే తెలంగాణ భవన్‌కు వచ్చారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘ప్రజలకు కష్టమొస్తే గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్‌కు కాదు.. తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. ప్రజల గూడు కూల గొడుతుంటే కేసీఆర్‌కు చెప్పుకుంటే సమస్య తీరుతదని ప్రజలు భావిస్తున్నారు. నేను బయలుదేరే ముందు ఇంటి వద్దకు ఆటో యూనియన్ వాళ్లు కూడా వచ్చి వాళ్ల ధర్నాకు రావాలని కోరారు. ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండి పడుతున్నారు’ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

‘కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ బిడ్డలను ఇంటి ఆడ పడుచును చూసుకున్నట్టు చూసుకున్నాడని గుర్తు చేసుకున్నారు. టెన్త్ పాసైతే చాలు పది వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్షా, పీహెచ్‌డీ చేస్తే లక్షా అన్నాడు. ఎవరికైనా వచ్చాయా..? ఈ విషయాలను మనం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. కేసీఆర్ పదేళ్లలో 60 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజీలు 146 ఉంటే 592 చేశారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లను 294 నుంచి 1022 కు పెంచారు’ అని కేటీఆర్ వివరించారు.

‘మెడికల్ కాలేజీలు 5 ఉంటే 33 చేశారు. నర్సింగ్ కాలేజీలను కూడా 33 చేశారు. మెడికల్ సీట్లు 800 నుంచి 3,581కు తీసుకొచ్చారు. సిద్దిపేటలో ఒకటే ఇంట్లో నాలుగు మెడిసిన్ సీట్లు వచ్చాయంటే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రంలో వైట్ కోట్ విప్లవం తెచ్చాం. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ అయ్యాం. అది కేసీఆర్ ఘనత. కానీ, మూసీలో పార బోసేందుకు రూ. లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట. గురుకులాల అద్దె కట్టేందుకు డబ్బులు లేవు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు దోచి పెడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.

‘బ్రేక్‌ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏమైంది. 25 సార్లు ఢిల్లీకి పోయి 25 పైసలు తేలేదు. తన సీటు కాపాడుకునేందుకు హై కమాండ్‌కు కప్పం, ఢిల్లీకి మూటలు సర్దేందుకే ముఖ్యమంత్రికి సమయం సరిపోతోంది. గురుకులాల్లో పాములు కుట్టి విద్యార్థులు చనిపోవటం చాలా దారుణం. కేసీఆర్ సమయంలో గురుకులాల విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే.. ఈ సీఎం మాత్రం గురుకులాలను పాతాళం లోకి తీసుకెళ్తున్నాడు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణను తీసుకపోయి ఆంధ్రాలో కలపాలి. ప్రశ్నించక పోతే తెలంగాణ మూగ బోతుంది. కాంగ్రెస్ ఏం చేసిన బీజేపీ వాళ్లు మాట్లాడటం లేదు. మేము గెలుస్తమని మేమే అనుకోకుండా అడ్డగోలు హామీలిచ్చామని ఓ కాంగ్రెస్ మంత్రి నాతోనే అన్నాడు. మీరే 15 మంది మార్చుకుంటే గెలుస్తుండే అన్నాడు. కానీ నా పేరు చెప్ప వద్దంటూ అన్నీ చెప్పేసిండు’ అని కేటీఆర్ చెప్పారు.

‘కాంగ్రెస్ మళ్లీ గెలిచేది లేదని.. నడిచినన్నీ రోజులు నడుస్తుదని ఎవ్వరి దుకాణం వాళ్ల తెరుచుకుంటున్నారు. మేము ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ పర్మిషన్లకు కూడా మంత్రిని కలవాల్సిన అవసరం రాలేదు. కానీ, ఇప్పుడు కరెంట్ కనెక్షన్ కోసం కూడా రూ. 25 లక్షలు తీసుకున్నారని ఓ బిల్డర్ చెప్పాడు. అందిన కాడికి దోచుకో.. అవన్నీ దాచుకో అన్నట్టు కాంగ్రెస్ వాళ్ల యవ్వారం ఉంది. గత పది నెలల్లో మన పార్టీ అన్ని కష్ట కాలాలను అధిగమించింది. కొన్ని పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన అడ్డగోలు హామీలతో మనం ఓడిపోయాం’ అని కేటీఆర్ వివరించారు.

‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఊహించని విధంగా ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్‌కు గాయం. కొంత మంది పార్టీ మారటం, మన పార్టీ నాయకురాలు కవితను జైలుకు పంపించటం చేశారు. అయినా సరే పోరాటం చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు ఎదురు దెబ్బ తగిలింది. పది నెలల్లో అన్ని కష్టాలను అధిగమించాం. ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మనల్నే తలచు కుంటున్నారు. దసరా రోజు ప్రతి ఇంట్లో ప్రజలు కేసీఆర్‌ను తలుచుకున్నారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు.. తెలంగాణకు అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ.. మతాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ.. మనకు ఒక్క మెడికల్, నర్సింగ్, నవోదయ పాఠశాల ఇవ్వలేదు.. తెలంగాణ విద్యార్థులకు ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. ప్రతి జిల్లాల్లో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టుకుందాం.. మన పార్టీలో ఎంతో మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్లను ప్రోత్సహించుకుందాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

‘మనకు చాకుల్లాంటి యువ నాయకత్వం ఉంది. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పోరాటాన్ని చూపించే ధైర్యం ప్రధాన మీడియా చేయటం లేదు. సోషల్ మీడియాలో మనమే పోరాటం చేయాలే. కేసులు పెట్టినా సరే భయపడవద్దు. మన లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసుకుందాం. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారు. బీఆర్ఎస్వీ జెండా లేని కాలేజ్ మనకు కనిపించవద్దు’ అని కేటీఆర్ సూచించారు.

‘డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్లు రాబోతున్నాయి. చాలా మందికి అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వాన్ని మనం తయారు చేసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గొంతుక. పేద ప్రజల ఇళ్లు కూల గొడుతుంటే, కేసులు పెడుతుంటే బీజేపోళ్లు మాట్లాడుతున్నారా..? పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్ జరిగితే మాట్లాడుతున్నారా..? పైన ఆడే నాటకం ఒకటి. లోపల మాత్రం వాళ్లు రెండు ఒక్కటే. తోడు దొంగలు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

‘సోషల్ మీడియాలో బూతులు తిట్టవద్దు. అది మన తెలంగాణ సంస్కృతి కాదు. మనం సబ్జెక్ట్‌ను మాత్రమే చర్చకు పెడదాం. ఈ సీఎం 60 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని అంటుంటే మాత్రం చిత్రంగా అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు మాత్రం 2 ఉద్యోగాలు వచ్చాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవటం లేదు’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

‘ప్రజలు మనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్లను అనటానికి ఏమీ లేదు. మనమే పొరపాట్లు చేశాం. డీఎంకే మాదిరిగా మరో 70 ఏళ్ల పాటు బలంగా ఉండేలా తీర్చిదిద్దుకుందాం. విద్యార్థి నాయకులంతా ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నాయకులు కావాలి’ అని కేటీఆర్ ఉత్సాహం నింపారు.

Whats_app_banner

టాపిక్

KtrBrsKcrRevanth ReddyTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024