Best Web Hosting Provider In India 2024
పులుసు ఉప్పుడు పిండి రెసిపీ ఉప్మా అంత సులువు. కాస్త బియ్యం నానబెట్టి పెట్టుకున్నారంటే ఎంతో రుచిగా కేవలం అయిదు నిమిషాల్లో రెడీ అయ్యే అల్పాహారం ఇది. తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇంట్లో ఉండేవే. రెసిపీ ఎలాగో చూసేయండి.
పులుసు ఉప్పుడు పిండి తయారీకి కావాల్సినవి:
1 కప్పు బియ్యం
4 ఎండుమిర్చి
1 ఉల్లిపాయ, ముక్కలు
అర చెంచాడు ఉప్పు
నిమ్మకాయంత చింతపండు
చిటికెడు ఇంగువ
చిన్న బెల్లం ముక్క
అర టీస్పూన్ జీలకర్ర
2 చెంచాల నూనె
అర టీస్పూన్ ఆవాలు
అర టీస్పూన్ శనగపప్పు
అర టీస్పూన్ మినప్పప్పు
1 కరివేపాకు రెమ్మ
పులుసు ఉప్పుడు పిండి తయారీ విధానం:
- ముందుగా బియ్యం బాగా కడిగి కనీసం ఓ రెండు గంట పాటూ నానబెట్టుకోవాలి.
- తర్వాత నీళ్లు వంపేసి బియ్యం ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, జీలకర్ర, మీకిష్టముంటే చిన్న బెల్లం ముక్క, కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టుకోండి.
- అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని కాస్త బరకగానే పిండి పట్టుకోండి.
- ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గుజ్జు కూడా మిక్సీ పట్టుకున్న పిండి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
- చింతపండు గుజ్జు మరీ ఎక్కువగా వేయొద్దు. దీనివల్ల పిండికి కాస్త పులుపుదనం వస్తే చాలు. అలాగే చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల దీని రుచి మరింత బాగుంటుంది.
- ఇప్పుడు ఒక కడాయి తీసుకుని వేడెక్కాక అందులో నూనె వేసుకోండి. కాస్త వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని వేయించండి.
- రంగు మారగానే కరివేపాకు రెమ్మ, ఎండుమిర్చి వేసి వేయించుకోండి.
- అన్నీ వేగిపోగానే మిక్సీ పట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసేయండి.
- కలుపుతూ ఉంటే ఓ అయిదు నిమిషాలకే పిండి ముద్దలా కాస్త పొడిగానూ అవుతుంది. మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోండి.
- చివరగా స్టవ్ కట్టేశాక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పుడు పిండిలో కలుపుకుని సర్వ్ చేయండి. రుచిగా ఉండే పులుసు ఉప్పుడు పిండి రెడీ అయినట్లే.