Bigg Boss Manikanta Elimination: బిగ్‍బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ సేఫ్

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో అనూహ్య పరిణామం జరిగింది. టీవీ సీరియల్ నటుడు నాగ మణికంఠ హౌస్ నుంచి ఏడో వారం తనకు తానుగా ఎలిమినేట్ అయిపోయారు. ఓట్లతో ఆడియన్స్ సేవ్ చేసినా.. సెల్ఫ్ ఎలిమినేషన్‍తో హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. నేటి (అక్టోబర్ 20) ఆదివారం ఎపిసోడ్‍లో ఇది సాగింది. చివర్లో హోస్ట్ కింగ్ నాగార్జున ఆప్షన్ ఇచ్చినా.. ఎలిమినేట్ అయ్యేందుకే మణికంఠ మొగ్గుచూపారు.

ఆదివారం ఎపిసోడ్ కావటంతో కంటెస్టెంట్లతో ఫన్ గేమ్స్ ఆడించారు నాగార్జున. బొమ్మలు గీసి సినిమాల పేర్లు కనిపెట్టడం, డైలాగ్స్ డెడికేట్ చేసుకోవడం లాంటి గేమ్స్ హౌస్‍మేట్స్ జోష్‍గా ఆడారు. డ్యాన్సులు చేశారు. మీమ్స్ చూపించి నవ్వించారు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. నామినేషన్లలో ఉన్న వారు క్రమంగా సేవ్ అవుతూ రాగా.. చివరికి డేంజర్ జోన్‍లో గౌతమ్ కృష్ణ, మణికంఠ నిలిచారు.

నేను వెళ్లిపోతా..

డేంజర్ జోన్‍లో ఉన్న మణికంఠ, గౌతమ్ కృష్ణ యాక్షన్ రూమ్‍లోకి వచ్చారు. ఆ తర్వాత ఇతర హౌస్‍మేట్లతో నాగ్ మాట్లాడారు. ఎక్కువ మంది మణిని పంపించేయాలనే నిర్ణయాన్ని చెప్పారు. హౌస్‍లో ఉండాలని ఉందా అని మణిని నాగార్జున అడిగారు. హెల్త్ టెస్టుల్లో ఆరోగ్యమంతా సరిగానే ఉన్నట్టు తేలిందని మణితో చెప్పారు. తనకు ఈ వారం సోమవారం వరకు హౌస్‍లో ఉండాలని కాస్త ఉండేదని, కానీ ఆ తర్వాత వెళ్లిపోవాలని అనిపిస్తోందని మణి చెప్పారు. గేమ్స్ ఆడలేకపోతున్నానని చెప్పారు. భార్య ప్రియకు ఏ మాట ఇచ్చావో, కూతురికి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకోవాలని మణితో నాగార్జున అన్నారు. అయినా తాను వెళ్లిపోతాననేలా మణి చెప్పారు.

తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదు అంకెలు కౌంట్ చేశారు నాగార్జున. అప్పుడు కూడా తాను హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతానని మణికంఠ తన నిర్ణయాన్ని చెప్పారు. తన సొంత నిర్ణయంతోనే మణి వెళ్లిపోతున్నారని నాగ్ అన్నారు.

మణి నిర్ణయంతో బతికిపోయిన గౌతమ్

మణి సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాక.. ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఎవరు సేవ్ అయ్యారో చూద్దామని నాగార్జున చెప్పారు. బావిలోని బకెట్‍లు లాగాలని చెప్పారు. దీంతో మణికి ఆకుపచ్చ, గౌతమ్‍కు ఎర్రటి రంగు బకెట్ వచ్చాయి. ఆడియన్స్ ఓట్ల ప్రకారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారని, మణిని సేవ్ అయ్యారని నాగార్జున తెలిపారు. అయితే, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నారు. దీంతో ఎలిమినేషన్ నుంచి గౌతమ్ బతికిపోయారు. దీంతో గౌతమ్‍ను హౌస్‍లోకి వెళ్లాలని, మణిని స్టేజ్ మీదకు వచ్చేయాలని నాగార్జున చెప్పారు.

ఆ తర్వాత హౌస్‍లో కంటెస్టెంట్లకు వీడ్కోలు చెప్పారు మణికంఠ. ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకొని తాను ఉండలేనని చెప్పారు. అందుకే బయటికి వెళుతున్నానని చెప్పారు. చివరికి మణికి గుడ్‍బై చెప్పేశారు కంటెస్టెంట్లు. స్టేజ్‍పైకి వచ్చారు మణి.

అందుకే నిర్ణయం

హౌస్‍లో తనకు ఒత్తిడి పెరిగిపోయిందని, గేమ్‍లతో పాటు అన్ని విషయాలు గందరగోళంగా అనిపించాయని స్టేజ్‍పైకి వచ్చాక నాగార్జునతో మణికంఠ చెప్పారు. డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని అనిపించిందని, అందుకే బయటికి వచ్చేందుకు నిర్ణయించుకున్నానని వివరించారు.

ఐదుగురిని ముంచిన మణి

హౌస్‍లో ఉన్న వాళ్లలో ఎవరిని బోట్ ఎక్కిస్తావ్.. ఎవరిని ముంచేస్తావని మణికంఠకు గేమ్ ఇచ్చారు నాగార్జున. నయని పావని, విష్ణుప్రియ, నబీల్, మహబూబ్, హరితేజ ఫొటోలను బోట్ ఎక్కించి.. వారిని ప్రశంసించారు మణికంఠ. టేస్టీ తేజ, నిఖిల్, పృథ్వి, గౌతమ్, ప్రేరణ ఫొటోలను మణికంఠ నీటిలో ముంచేశారు. టేస్టీ తేజ సరైన ఎనర్జీ చూపలేదని, నిఖిల్ మొదటిలో ఉన్నంత ఊపు ఇప్పుడు చూపడం లేదని మణి అన్నారు. పృథ్వి తన మెదడు వాడుతూ ఆడాలని, కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆడాలని చెప్పారు. అవసరమైనప్పుడే నోరు విప్పాలని గౌతమ్‍కు మణి సూచించారు. ప్రేరణ ఏదో ఒకటి చెప్పాలని ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారని మణికంఠ చెప్పారు. ఇలా ఐదుగురిని ముంచేశారు. ఆ తర్వాత స్టేజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు.

మొదటి నుంచి ఎమోషనల్‍గా..

బిగ్‍బాస్ తెలుగు 8లో మణికంఠ మొదటి నుంచి చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు. తొలి రోజే ప్రాంక్ వల్ల ఏడ్చేశారు. ఆ తర్వాత కూడా తన భార్య, కూతురు గురించి తలుచుకొని కొన్నిసార్లు కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ పరిస్థితులను చెప్పుకొని బాధపడ్డారు. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ కొందరు అతడిని విమర్శించారు. మణిని టార్గెట్ చేశారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చాక కాస్త మణికంఠ చురుగ్గా అయినట్టు కనిపించింది. అయితే, ఇక ఆరోగ్యం సహకరించడం లేదంటూ తనకు తానే ఇప్పుడు ఏడో వారంలో సెల్ఫ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు మణికంఠ.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024