AP TET And DSC Update: నేటితో ముగియనున్న ఏపీ టెట్ పరీక్షలు, నవంబర్‌ 2న ఫలితాలు..నవంబర్‌ 3న డిఎస్సీ నోటిఫికేషన్‌

Best Web Hosting Provider In India 2024

AP TET And DSC Update: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నేటితో ముగియనున్నాయి. అక్టోబర్ 3 నుంచి జరుగుతున్న పరీక్షలకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు హాజరవుతున్నారు. గత 16 రోజులుగా టెట్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21తో పరీక్షలు ముగియనున్నాయి.

ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదహారవ రోజు ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 23187 మందికి గాను 19466 మంది అభ్యర్థులు అనగా 83.95 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 73 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12492 మందికి గాను10448 మంది అనగా 83.64 శాతం మంది హాజరయ్యారు.

మధ్యాహ్నం 64 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 10695 మందికి గాను 9018 మంది అనగా 84.32 శాతం మంది హాజరయ్యారు. పదహారవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలియజేసారు.

ఫలితాలు నవంబర్ 2న విడుదల…

ఏపీ టెట్‌ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్ పరీక్షల ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు.

టెట్ ఫలితాలు వెలువరించిన మరుసరటి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించినా మరింత మంది అభ్యర్థులకు టెట్‌ అర్హతకు అవకాశం కల్పించడంలో భాగంగా తొలుత టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్‌ 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

సిలబస్‌లో మార్పు లేదు…

డిఎస్సీ 2024 సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని స్పష్టత ఇచ్చారు.

మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు.

అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. స్కూళ్ల మూసివేతకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ. 117 వలన ఎటువంటి నష్టం కలిగిందన్న విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావటంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

పోస్టుల వివరాలు…

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

స్కూల్ అసిస్టెంట్ – 7,725

ఎస్‌జీటీ – 6371

టీజీటీ – 1781

పీజీటీ – 286

పీఈటీ – 132

ప్రిన్సిపల్స్ – 52

నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు…

ఏపీ టెట్‌ 2024 పరీక్షకు 4,27,300 దరఖాస్తు చేసుకున్నారు. వారిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు: 4,09,955 మంది ఉన్నారు. మొత్తం 108 పరీక్షా కేంద్రాల్లో టెట్‌ నిర్వహిస్తారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపురం, గంజాంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది ఉన్నారు. డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు కఠినంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. డిఎస్సీలో టెట్‌ స్కోర్‌కు వెయిటేజీ ఉండటంతో పలువురు అభ్యర్థులు టెట్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పూర్తైన పరీక్షలకు కీ విడుదల కావడంతో గతంలో వచ్చిన స్కోర్‌ కంటే తక్కువ మార్కులు వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Whats_app_banner

టాపిక్

Ap TetAp Dsc 2024Ap JobsTeachers
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024