Visakha Crime : ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం, బాధితురాలి కుటుంబంతో రూ.20 వేలకు గ్రామపెద్దల బేరం

Best Web Hosting Provider In India 2024

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరమైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతోన్న విద్యార్థినిపై ఓ యువ‌కుడు మ‌ద్యం సేవించి అత్యాచారానికి యత్నించాడు. అనంత‌రం పేద విద్యార్థిని అయిన‌ ఆ బాలిక త‌ల్లితో రూ.20 వేలకు బేరానికి పెద్ద మ‌నుషులు దిగారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కడంతో రూ.20 కాస్తా, పెద్దలు రూ.40 వేల‌కు పెంచారు. అయితే ఈ ప్రయ‌త్నాలు బెడిసికొట్టాయి. బాలిక సామాజిక వ‌ర్గం పెద్దల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో, వారితో క‌లిసి బాలిక‌ పోలీసుల‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘోర‌మైన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా అచ్యుతాపురం మండ‌లంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల క‌థ‌నం ప్రకారం సెజ్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ పేద కుటుంబానికి చెందిన బాలిక అచ్యుతాపురంలో ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతోంది. ఈనెల 19న రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో బాలిక ఇంటి వ‌ద్ద ఉంది.

అదే గ్రామానికి చెందిన యువ‌కుడు, ఆ బాలిక‌కు ఫోన్ చేసి ఆమె త‌ల్లి గురించి అస‌భ్యక‌రంగా మాట్లాడాడు. దీంతో ఆ బాలిక త‌న త‌ల్లి గురించి అస‌భ్యక‌రంగా మాట్లాడతావా అంటూ ప్రశ్నించ‌డానికి ఆ యువ‌కుడు ఉన్న వ‌ద్దకు వెళ్లింది. ఆ బాలిక వెళ్తు వెళ్తూనే ఆ యువ‌కుడిని నిలదీస్తూ ప్రశ్నించింది. వెంట‌నే అప్పటికే మ‌ద్యం సేవించిన ఉన్న ఆ యువ‌కుడు ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా లొంగ‌దీసుకోవ‌డానికి ప్రయ‌త్నించాడు.

అప్పటి వ‌ర‌కు ఇంటివ‌ద్దే ఉన్న కుమార్తె క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లి చుట్టుప‌క్కల వెతికింది. బాలిక త‌ల్లి రావ‌డంతో ఆ యువ‌కుడు అక్కడి నుంచి ప‌రార‌య్యాడు. ఈ విష‌యాన్ని బాధిత కుటుంబం గ్రామానికి చెందిన పెద్ద మ‌నిషి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ పెద్ద మ‌నిషి ఆ యువ‌కుడిని పిలిపించి, మంద‌లించి పంపేశాడు. దీనిపై బాలిక త‌ల్లి అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేంటీ కేవ‌లం మంద‌లించి వ‌దిలేశార‌ని ప్రశ్నించింది.

దీంతో బాలిక త‌ల్లితో రూ.20 వేలు ఇస్తామ‌ని బేరం పెట్టారు. శుక్రవారం ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఈ మొత్తాన్ని రూ.40 వేల‌కు పెంచారు. బాలిక సామాజిక వ‌ర్గానికి చెందిన పెద్దల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో దీనిపై శుక్రవారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప‌ర‌వాడ డీఎస్పీ స‌త్యనారాయ‌ణ స్పందిస్తూ బాలిక‌పై యువ‌కుడు అత్యాచారానికి య‌త్నించాడ‌ని, దీనిపై పోక్సో కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsCrime ApVisakhapatnamTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024